41 ఏళ్లలో ఒకరిపైఒకరు 60 కేసులు పెట్టుకున్న దంపతులు.. ‘ఏం చేద్దాం!’ అంటూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

  • కొన్ని వివాదాలు ఓ పట్టాన పరిష్కారం కావన్న సీజేఐ రమణ
  • కోర్టుల చుట్టూ తిరగడానికే వాళ్లు ఇష్టపడతారని కామెంట్
  • మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచన
సంసారం అన్నాక ఆలుమగల మధ్య చిన్నచిన్న కలతలు సహజం. అయితే, ఓ జంట మాత్రం 41 ఏళ్లలో ఒకరిమీద ఒకరు 60 కేసులు పెట్టుకున్నారు. 30 ఏళ్లు కాపురం చేసి.. మనస్ఫర్థల కారణంగా విడిపోయారు. 11 ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్నారు. ఇప్పుడూ వాళ్లిద్దరూ కోర్టుకెక్కడంతో సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ మిహా కోహ్లీ, జస్టిస్ కృష్ణ మురారిల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

వారి కేసుపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. ‘‘మీ లాయర్ల తెలివితేటల్ని తప్పక గుర్తించాల్సిందే’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘కొన్ని వివాదాలు ఓ పట్టాన పరిష్కారం కావు. ఎప్పుడైనా ఒక్కరోజు కోర్టును చూడకపోతే వారికి నిద్ర పట్టదు, ఏం చేద్దాం! వాళ్లు ఎప్పుడూ కోర్టు చుట్టూ తిరగడానికే ఇష్టపడతారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

మధ్యవర్తిత్వం ద్వారా కేసును పరిష్కరించుకోవాలని దంపతులకు సూచించారు. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేదాకా వేరే పెండింగ్ కేసులపై కోర్టుకు వెళ్లరాదని దంపతులకు ధర్మాసనం తేల్చి చెప్పింది.

Supreme Court
CJI
Justice N.V. Ramana

More Telugu News